మరిన్ని విజయాలతో దేశానికి ఖ్యాతి తెస్తా

మోడీ ట్వీట్‌పై స్పందించిన గోల్డెన్‌ గర్ల్‌ హిమాదాస్‌
న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి):  గోల్డెన్‌ గర్ల్‌ హిమాదాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. దేశంకోసం ఆడుతానని, మరిన్ని విజయాలు సాధిస్తానని ప్రధాని మోడీకి హావిూ ఇచ్చారు.  20 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలతో యావత్‌ భారతం చూపును తనవైపు తిప్పుకున్న ఈ యువక్రీడాకారిణిని ప్రశంసిస్తూ సోషల్‌ విూడియాను నెటిజన్లు ¬రెత్తిస్తున్నారు. రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ మొదలుకొని ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆమెను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. గత కొన్నిరోజులుగా హిమ సాధిస్తున్న విజయాలకు దేశమంతా గర్విస్తోందని.. వివిధ టోర్నీలలో ఐదు స్వర్ణ పతకాలు సాధించడం అద్వితీయమంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరకుంటున్నానని ఆయన అన్నారు. దీనిపై హిమాదాస్‌ స్పందించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఇలాగే మరింతగా శ్రమిస్తూ.. దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తాను అంటూ ప్రధానికి హిమ మాటిచ్చారు. మరోవైపు కృతజ్ఞతలు తెలుపుతూ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ చేసిన ట్వీట్‌కి కూడా హిమ రిప్లై ఇచ్చారు. భారత్‌కు తిరిగి రాగానే కలిసి.. ఆశీర్వాదాలు తీసుకుంటానని ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. ఈ నెలలో పోలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌లలో జరిగిన ఐదు విభిన్న టోర్నమెంట్లలో హిమాదాస్‌ తొలి స్థానంలో నిలిచి ఐదు గోల్డ్‌ మెడళ్లను దక్కించుకున్న విషయం తెలిసిందే.