మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ధి: షిండే

కామారెడ్డి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ షిండే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆడపడుచులు ఆయన విజయాన్ని కోరుకుంటూ మిఠాయిలు తినిపించారు. అనంతరం రచ్చబండ వద్ద ప్రసంగించారు. చేసిన అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, సదా విూసేవలో ఉంటూనంటూ హావిూ ఇచ్చారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ జుక్కల్‌ మాజా ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్‌షిండే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో జుక్కల్‌ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరిగిన అభివృద్ధి పనులు, నిరుపేదలకు అందుతున్న పథకాలను చూసి ప్రజలు మరోమారు టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అధినేత కేసీఆర్‌ అండదండలతో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నానని చెప్పారు. రూ.కోట్లు వెచ్చించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లు నిర్మించామన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.470 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ఎత్తిపోతల పథకంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.