మరోమారు టోల్‌ వసూళ్ల పెంపు

1నుంచి అమల్లోకి తెచ్చేందుకు యత్నాలు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వసూలు ధరలు మరోసారి పెరగనున్నాయి. జిల్లాలోని శాఖాపూర్‌ వద్ద ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న టోల్‌ ప్లాజా వద్ద రేట్లు పెంచేందుకు రంగం సిద్దం చేశారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రూ. 5 నుంచి రూ. 10 వరకు వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పెంచిన ధరలు అమలులోకి వస్తాయి. 2009లో ప్రారంభమైన అడ్డాకుల టోల్‌గేట్‌ ప్రారంభమవగా ఇప్పటికీ 9 సార్లు వసూళ్లలో మార్పులు చేశారు. ఇందులో 7 సార్లు ధరలు పెంచగా 2 సార్లు మాత్రం స్వల్పంగా తగ్గించారు. ప్రస్తుతం లైట్‌ మోటారు 4 చక్రాల వాహనం 24 గంటల రాక పోకల కోసం రూ.90 వసూలు చేస్తుండగా ఈ ధరల్లో మార్పు చేయలేదు. డీసీఎం వాహనానికి ఇంతకు ముందు రూ. 155 వసూలు చేయగా రూ.5 పెంచారు. 40 మందికి పైగా ప్రమాణం చేసే బస్సులకు, లారీలకు రూ.310 ఉండగా కొత్తధర రూ.320కి పెంచారు. భారీ వాహనాలు లారీలు వంటి వాటికి రూ.500 ఉండగా కొత్తధర రూ. 510కి పెంచారు. శాఖాపూర్‌ వద్ద ఉన్న టోల్‌గేట్ల ద్వారా రోజు 18 వేల వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. వీటి ద్వారా వసూలయ్యే మొత్తాన్ని జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరచేందుకు ఖర్చు చేయాల్సి ఉంది.