మరోమారు పెరిగిన బంగారం,వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం అంటున్న వ్యాపారులు
న్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  బంగారం ధర జిగేల్‌ మంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. వేలల్లో పెరుగూత వందల్లో తగ్గుతోంది. దీంతో పసిడి ధర పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర శనివారం కూడా పైపైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ ధరలు పెరిగాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదిలింది. రూ.50,290 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.46,100కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.67,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణెళిపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర జిగేల్‌ మంది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1842 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.74 శాతం పెరుగుదలతో 24.31 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.