మరో ఘోరం….

 ఉత్తరప్రదేశ్‌లోని ఈటా గ్రామంలో మరో ఘోరం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు వివాహ వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈటా గ్రామంలో వివాహ వేడుకకు తల్లిదండ్రులతో పాటు బాలిక హాజరయ్యింది. పెళ్లి వేడుక సందర్భంగా హడావిడిగా వుండటంతో టెంట్‌ హౌస్‌లో పనిచేసే సోను అనే యువకుడు బాలికను తీసుకెళ్లి పక్కనే నిర్మాణంలో ఉన్న ఇంటిలో అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా కొట్టి చంపేశాడు. పెద్ద శబ్దంతో పాటలు హోరెత్తడంతో బాలిక పెట్టిన కేకలు ఎవరికీ వినిపించలేదు. పెళ్లి తర్వాత బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఊరిలో వెతకడం ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో బాలిక మృతదేహాన్ని చూసిన వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బాలికను కిరాతకంగా చంపిన సోను కూడా మృతదేహం పక్కనే మద్యం సేవించి పడివుండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సోనూను అదుపులోకి తీసుకున్ని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కథువా , సూరత్‌ ఘటనలు మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.