మరో భారీ అగ్నిప్రమాదం.. ఏడు షాపులు ఆహుతి…

ముంబై: ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు దేశ ఆర్ధిక రాజధాని ముంబై వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. రే రోడ్డులోని చావల్స్ గోడౌన్‌లో నిన్న అర్థరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఏడు షాపులు కాలి బూడిదయ్యాయి. ఓ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఆరు ఫైరింజన్లు, నాలుగు వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అర్థరాత్రి కావడంతో అప్పటికే దాదాపు ఏడు షాపులకు మంటలు పాకాయి. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా పదిరోజుల క్రితం ముంబైలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నెల రోజుల వ్యవధిలోనే ఓ స్నాక్స్ షాపుతో పాటు, ముంబై సెషన్స్ కోర్టు, సినీవిస్తా స్టూడియో సహా పలుచోట్ల అగ్నిప్రమాదాలు కలవరానికి గురిచేశాయి.