మహబూబ్‌నగర్: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పల్లెపాడు గ్రామానికి చెందిన ఆంజనేయుడు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు. సోమవారం ఉదయం ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు. పోలీసులు ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న ఆంజనేయులు, అతని తల్లి కోసం గాలింపు చేపట్టారు.