మహాకూటమి పగటి కలలు కంటోంది

– ఈసీ నిబంధనల మేరకే ‘రైతుబంధు’ సాయం
– బీజేపీకి కాంగ్రెస్‌ ఎంత దూరమో.. టీఆర్‌ఎస్‌కు అంతేదూరం
– ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : తాము అధికారంలోకి వస్తామని మహాకూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, వారి తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
కాంగ్రెస్‌ నాయకులకు నిరాశ, నిస్కృహలు అలుముకున్నాయని, మహాకూటమికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఆలోచన లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాడిన తరువాత రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయని, రాష్ట్రంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కానీ కాంగ్రెస్‌ నేతలను ప్రాజెక్టులు పూర్తయితే తమ భవిష్యత్తు ఉండదని ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కోర్టులకెళ్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే పదేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. షబ్బీర్‌ అలీ మాటలు అవాస్తవాలని ఎంపీ గుత్తా కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌కు ఎంత దూరమో బీజేపీకి అంతే దూరమన్నారు. మజ్లీస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలుకుతుందని, వచ్చే ప్రభుత్వంలో రిజర్వేషన్లపై పెను మార్పులుంటాయని చెప్పారు. రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాలో జమ అవుతుందన్నారు. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఈసీ ఆదేశించినట్లు చెప్పారు. 25 వరకు రైతుల బ్యాంక్‌ అకౌంట్ల వివరాలను అధికారులు సేకరిస్తారని చెప్పారు. రైతుల బ్యాంక్‌ అకౌంట్లలోనే నగదు జమ అవుతుందని అన్నారు. మొదటివిడత బకాయిలు కూడా ఖాతాల్లో జమ అవుతాయని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 100 ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.