మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

రంగారెడ్డి (కీసర): మహిళపై ఓ కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన మహిళ (35) ఈసీఐఎల్‌లోని తులసి ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తోంది. గురువారం రాత్రి విధులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఈసీఐఎల్ బస్‌స్టాప్ వద్ద ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆమెతో మాటలు కలిపాడు. ఆటోను దమ్మాయిగూడ కాకుండా చీర్యాల గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించాడు. అనంతరం మహిళకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారయత్నం చేయగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలోని పొలాల రైతులు అక్కడికి వచ్చి కానిస్టేబుల్ శ్రీనివాసులును చితకబాదారు. ఆటో డ్రైవర్ పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శ్రీనివాసులును అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు.