మహిళాభ్యుదయానికి పెద్దపీట

వివిధ పథకాలతో పేదలకు అండ: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,నవంబర్‌28(జనం సాక్షి): మహిళలందరికీ అండగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఇంటికీ నల్లా నీరు త్వరలో అందిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం మహిళల సంక్షేమానికి నిదర్శనమని అన్నారు. కొంత మంది ఓట్లు, రాజకీయ లబ్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి కోసం రూ.1.20లక్షలు ఖర్చు చేసి ఇంగ్లిష్‌ విూడియంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఉన్న పింఛన్‌ను పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీదే అన్నారు. గతంలో ఇందిరమ్మ పథకంలో కేవలం కాంగ్రెస్‌ నాయకులే ఇండ్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎందరో మంది తమ దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. అర్హులైన వారందరికి రూ.5లక్షల 30వేలతో డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. కొంత మంది రాజకీయ లబ్ధికోసం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం బంద్‌ చేస్తున్నారని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు 90 శాతం ఉన్నారన్నారు. వారి అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని చెప్పారు.గత ప్రభుత్వాలు సీలింగ్‌ పద్ధతిలో ఒక్కరికి నాలుగు కిలోల బియ్యం పంపిణీ చేశారని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది ఉన్నా అందరికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు.