మహిళా సాధికారత కోసం పోరాడిన యోధురాలు ఈశ్వరీబాయి

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 1,(జనంసాక్షి): సమాజ సేవకురాలు, దళిత సంక్షేమకర్త దివంగత ఈశ్వరీబాయి శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేటీఆర్‌ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్‌ అవార్డ్‌-2017ను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌కు మంత్రి కేటీఆర్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈశ్వరీబాయి సేవలు మరువలేనివని.. దశాబ్దాల క్రితమే మహిళా సాధికారతకోసం ఆమె కృషి చేశారన్నారు. ఈశ్వరీబాయి ధీర వనిత. ఆమె బాటలోనే ఎమ్మెల్యే గీతారెడ్డి కూడా నడుస్తున్నారని పేర్కొన్నారు.