మాదిగలకు 2వేల పెన్షన్‌ ఇవ్వాలి

వరంగల్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ డప్పు వాయించే వారికి, చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి రూ.2 వేల చొప్పున పింఛన్‌ అందించాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేసింది. వారు అత్యంత దీనస్థితిలో ఉన్నారని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య మాదిగ అన్నారు. వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉందన్నారు. పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేపట్టనున్న ఉద్యమంతో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని సాంబయ్య మాదిగ పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు కోటిమంది మాదిగలు, ఇతర ఉపకులాల కోసం ఎమ్మార్పీఎస్‌ పోరాటం చేస్తోందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు ధర్మయుద్దానికి దారి తీసిందన్నారు. వర్గీకరణ సాధిస్తే రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఎంతోకాలంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి ఇదొక్కటే మార్గమని అన్నారు. ఈ ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.