మార్కెట్లలో దళారులకు అడ్డుకట్ట పడదా?

 

కొనుగోళ్ల తీరుపై మండిపడుతున్న అన్నదాతలు

నిజామాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన

అన్నదాతను అందరూ కలిసి నిలువునా ముంచుతున్నారు.ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని కాపాడుకున్న పంటను మార్కెట్‌కు తెస్తే తేమ సాకు, తాలు పేరుతో వ్యాపారులు అగ్గువ సగ్గువకు బేరమాడుతుండటంతో బేలచూపులు చూడటం అన్నదాత వంతవుతుంది. పత్తి,మక్కరైతులు గిట్టుబాటు లేక లబోదిబో మంటున్నారు. ఈఏడాది ధాన్యం కొనుగోళ్లు పెద్దఎత్తున ప్రారంభమైనా ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ లాంటి సంస్థ కొనుగోలు కేంద్రం జాడలేదు. ఒకవేళ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా తమకు పెద్దగా ఒరిగేది ఏవిూలేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న అన్నదాతకు దళారుల బెడద ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పంటలకు చీడపీడలలాగా వీరుకూడా రైతులను అంటిపెట్టుకునే ఉంటారు. వీరు ఎక్కడికి వెళితే అక్కడ వీరికన్నాముందే ప్రత్యక్షం అవుతారు. దీంతో వీరికి గిట్టుబాటు ధరలు ఎలాగూ రావు. కనీసం మద్తు ధరలు కూడా రాకుండా చేస్తారు. తాము దర్జాగా కార్లలో తిరుగుతూ విలావంతమైన జీవితం గడపడానికి అన్నట్లుగా వీరు వ్యాపారులతో కుమ్మక్కయి రైతులను నిలువునా పీల్చేస్తుంటారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వీరు లేకుండా మార్కెట్లు ఉండవు. వ్యాపారులు ఉండరు. దీంతో రైతులు ఇదంతా తమ ఖర్మగా భావించి చివరకు గొర్రె కసాయి వాడిని నమ్మిన చందనా అటుతిరిగి ఇటుతిరిగి వారివద్దకే వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడుతోంది. దళారుల కారణంగానే రైతులు తము పండించన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇకపోతే ప్రభుత్వం ప్రకటించిన విధంగా మార్కెట్లు ఉండవు. ధరలు పేరుకే ఉంటాయి. సీజన్‌ ప్రారంభంలో ఆశించిన రీతిలో లభించినా కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పట్టేలా చేస్తారు. కారణం పంటబాగా వచ్చిందనో లేదా, మార్కెట్‌లో ఆదరణ లేదనో ప్రచారం చేస్తారు. తీసుకుని వచ్చిన ధాన్యం అయినకాడికి అమ్ముకునేలా చేస్తారు. ఇప్పుడు మక్కల ధరలను తీసుకుంటే ఇదే విషయం అర్థం అవుతోంది. వివిధ మార్కెట్లలో ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులు ఆందోళనకు దిగినా పలకరించే వారు లేరు. మక్కలకు ధర పలకడం లేదు. కొద్దిరోజులుగా వ్యవసాయ,మార్కెట్‌కు ధాన్యం రాక పెరగడంతో ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని రోజుల నుంచి మార్కెట్‌కు మక్కలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశంచేసి మద్దతు ధరలను మాయం చేశారు. ఈ క్రమంలో వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధరను రైతులకు అందేలా చూడడంలో మార్కెట్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారులకు కొందరు అధికారులు సహకరిస్తుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోగా వచ్చిన కొద్దిపాటి దిగుబడిని మార్కెట్‌కు తెస్తే మద్దతు ధరలు లభించకపోవడం వారిని కృంగదీస్తోంది. తేమ, మట్టి పేర సాకులు చెబుతూ గిట్టుబాటు ధర ఇవ్వడంలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సివిల్‌సప్లయ్‌,మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి మక్కలను, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరుతున్నా అనుకున్న స్పందన రావడం లేదు. మార్కెట్‌ కమిటీకి పాలకవర్గాలను నియమించినా వారు కూడా చేతులెత్తేస్తున్నారు. కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వారంరోజులుగా మార్కెట్‌ యార్డులో ధాన్యం రాశులు పేరుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. తేమ తగ్గితే ప్రభుత్వ మద్దతు వస్తుందనే ఆశతో రైతులు నాలుగైదు రోజులుగా యార్డులో ధాన్యం ఆరబెట్టుకున్నా, కొద్దిపాటి తేడా ఉన్నా అధికారి కొనుగోలుకు ముందుకు రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా తక్కువ ధరలను చూపి దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతులు చేసేది లేక వ్యాపారులు అడిగినంత ధరకు అమ్ముకొని ఇంటిముఖం పట్టాల్సిన దుస్థితి మార్కెట్‌లో నెలకొంది.