మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్ల కోసం మక్కరైతుల చూపు


ఇప్పటికీ ఆదేశాలు రాలేదంటున్న అధికారులు
పంట చేతికి రావడంలో అమ్మకం కోసం ఆందోళన
నిజామాబాద్‌,అక్టోబరు20( (జనం సాక్షి)): ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా మొక్కజొన్నల కొనుగోళ్లకు సంబంధించి రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ యేడు మక్కలు బాగానే పండాయి. తమ పంటలకు సంబంధించి ప్రకటన రావడం లేదని వారు వాపోతున్నారు. మక్కల కొనుగోళ్లపై స్పష్టత
ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొక్కజొన్న రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యక్తులు, దళారుల చేతిలో ఎక్కడ మోసపోతామోనని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చిన మాట వాస్తవమే అయినా కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మార్కెఎఫెడ్‌ అధికారులు అన్నారు. భుత్వం ఆదేశిస్తే మొక్కజొన్న పంటను కొనుగోలు చేయలేమన్నారు. ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాలలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ప్రతీ వానా కాలం, యాసంగి సీజన్‌లలో రైతులు ఎక్కువగా మొక్కజొన్ననే సాగు చేస్తుంటారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం భారీగానే రైతులు మొక్కజొన్నను సాగు చేశారు.ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం.. పైగా తెగుళ్ల బెడద లేకపోవడంతో మొక్కజొన్న దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పంటలు చేతికి వచ్చినా జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అహర్నిశలు కష్టించి పండిరచిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న పంటను ఇప్పుడిప్పుడే రైతులు మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. కానీప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఆయా మార్కెట్‌ యార్డులతో పాటు సహకార సంఘాల కేంద్రాల వద్దకు రైతులు తరలిస్తున్నారు. ప్రతియేటా మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే మొక్కజొన్నను కొనుగోలు చేస్తూ వస్తుంది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేపడుతోంది.ఈ ఏడాది పంట మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో మొక్కజొన్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయక పోతే బహిరంగా మార్కెట్‌ లో దళారులు, ప్రైవేట్‌ వ్యక్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసే ప్రమాదం ఉందన్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని, ప్రభుత్వమే కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని రైతులకు ఆదేశించింది. వ్యవసాయశాఖ అధికారులు సైతం రైతులకు అవగాహన కల్పించారు. గత వానకాలం సీజన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై జిల్లా రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధించి మొక్కజొన్న పంటను రహదారిపై పారబోసి పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఇలా జిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కోనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేపట్టింది. కేవలం ఈ వానాకాలం సీజన్‌లోనే కొనుగోళ్లు చేస్తామని, ఇక విూదట కొనుగోళ్లు చేసే ప్రసక్తే ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. గత ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి క్వింటాలు మొక్కజొన్నకు రూ.1850 మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసింది. అయితే బహిరంగా మార్కెట్‌లో మాత్రం మొక్కజొన్న క్వింటాలు రూ.1900 వరకు ధర పలికింది. ప్రభుత్వం
మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1870 మద్దతుధరను ఇటీవల ప్రకటించింది. ఈ మద్దతుధరకే ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.