మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి

– ముంపుబాధితుల గోస పట్టదా?
– తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి
– ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు
– నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు
– రూ. 1000 కోట్లు వెచ్చించి ప్రగతి భవన్‌ నిర్మించుకున్నారు
– ప్రతిపక్ష నేతల ఆందోళన
– భారీ వర్షంలో కొనసాగిన ముంపు బాధితుల సభ
బోయినిపల్లి, ఆగస్టు 30(జనంసాక్షి):  పరీహారం అందక మిడ్‌మానేరు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అండగా నిలిచిన ప్రజలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మిడ్‌మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని భావించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు  ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఊర్లను మానేర్‌లో ముంచి కేసీఆర్‌ మూటలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహి అంటున్నారని మండిపడ్డారు. ‘మిడ్‌మానేరు నిర్వాసితులు ఇల్లు కట్టుకునేందుకు రూ. ఐదు లక్షల నాలుగు వేలు, 18 ఏళ్లు నిండిన వారికి రూ.2లక్షలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హావిూ ఇప్పటి వరకూ నెరవేర్చలేదు కానీ కానీ ఆయన సొంత గ్రామం చింతమడకకు మాత్రం ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇస్తానంటున్నారు. చింతమడకకు ఏమైందని లక్షలకు లక్షలు ఇస్తున్నారు? నష్ట పరిహారం చెల్లించేందుకు నీ బంధువలు తప్ప ముంపు గ్రామాల ప్రజలు కనిపించాడంలేదా? టీఆర్‌ఎస్‌ పార్టీ దొంగల బండిగా మారింది. చివరికి చెప్పులు కూడా విడిచిపెట్టడం లేదు’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 13గ్రామాల ప్రజలు మౌనంగా ఉంటే హక్కులు తీరవన్నారు. వచ్చే బ్జడెట్‌ సమావేశ సమయంలో హైదరాబాద్‌లో 48 గంటల దీక్ష చెపట్టమని నిర్వాసితులకు సూచించారు. దీక్షలో తాను కూడా పాల్గొంటానని, అప్పుడు ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామని రేవంత్‌ వ్యాఖ్యానించారు. మంచిగా నష్ట పరిహారం చెల్లిస్తే సరి లేదంటే దంచి తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈటల రాజేందర్‌ మాటలతో భూకంపం పుట్టిందనుకున్నాం. రాత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేయగానే ఈటల తుస్సుమనిపించారు. ఇదేనా కరీంనగర్‌ పౌరుషమంటే అని  రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌ అమెరికాలో బాత్‌రూమ్‌లు కడుగుతూ బతికిండని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హావిూలన్ని నెరవేర్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌, ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల 4వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చాలని లేనట్లయితే కేసీఆర్‌ వస్తున్న రోజు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామన్నారు. ఎంపీ సంతోష్‌కు పుట్టిన గడ్డపై మమకారం ఉంటే మిడ్‌మానేరు ముంపుకు గురైన 13 గ్రామాలను దత్తత తీసుకోవాలని సవాల్‌ విసిరారు. ప్రజలు కొంతకాలంగా ఆందోళనచేస్తున్నా పట్టించుకోని సిఎం ప్రజలకు మేలు చేస్తాడని నమ్మగలమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ ప్రజా గాయకురాలు విమలక్క సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చడా వెంకట్‌ రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌  ఎమ్మెల్సీ జీవన్‌ రెడీ,మేడిపల్లి సత్యం, ప్రజాగాయకుడు, ఏపురి సోమన్న, అది శ్రీనివాస్‌, కేకే మహేందర్‌ రెడ్డి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ  లింగంపల్లి శంకర్‌ ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు, కుస రవీందర్‌, బోయిన్పల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎం డి బాబు బిజెపి మండల అధ్యక్షుడు గుడి రవీందర్‌ రెడ్డి మరియు ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు