మినరల్‌ ఆదాయంలో పాఠశాలలకు కేటాయింపులు

అధికారులకు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూచన

నల్గొండ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): జిల్లాలో మినరల్‌ ద్వారా వస్తున్న ఆదాయంలో 30 శాతం మొత్తం అభివృద్ధి పనులకు వినియోగించాలని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. అందులో మొదటి ప్రాధాన్యంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠాశాలలో మరుగు దొడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధ్యక్షతన మినరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశంలో మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ పాఠాశాలకు ప్రహారిగోడ విధిగా నిర్మించాలి.పాఠశాలలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నందున నీటి నిల్వకు ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలి. మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు అన్ని పాఠశాలల్లో నీటి సరఫరా ఉండేలా చూడాలి. రెండవ ప్రాధాన్యత కింద ప్రతి ప్రభుత్వ వసతి గృహాలలో ఇదే పద్ధతి అమలు జరిగేలా చూడాలి. ప్రభుత్వ వసతి గృహాలలో అంతస్తుల వారీగా మరుగు దొడ్లను ఏర్పాటు చేయాలి. మూడో ప్రాధాన్యత కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రహారీ గోడల నిర్మాణాలు చేపట్టాలి. ప్రభుత్వ భవనాల నమూనాలను తయారు చేస్తున్న ఇంజినీరింగ్‌ విభాగం ప్రహారీ గోడలకు, మరుగు దొడ్ల కు ప్రాధాన్యత ఇవ్వక పోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, లోక్‌ సభ సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌ కుమార్‌, వేముల వీరేశం, ఎన్‌.భాస్కర్‌ రావు, కుసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, రవీంద్ర కుమార్‌ తదితరులు హాజరయ్యారు.