మిర్చి కూలీలతో మాట్లాడుతున్న మోహన్‌లాల్‌

-పార్టీలో చేరుతున్న యువత

నేను రైతు కుటుంబికుడినే….రైతుల కష్టాలు నాకు తెలుసు

-అనంతారంలో బీఎల్‌ఎఫ్‌ ప్రచారం…

మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి):

రైతు కుటుంబం నుండే తాను వచ్చానని, రైతుల కష్ట సుఖాలేంటో చిన్నప్పడి నుండే తెలుసని బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బానోత్‌ మోహన్‌లాల్‌ అన్నారు. మండలంలోని అనంతారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మిరప కూలీలతో కలిసి మిర్చీలు ఏరుతూ వారితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోందని, రైతుబంధు పేరుతో పేద రైతులను అన్యాయం చేసిందన్నారు. రైతుబంధుతో కేవలం ఉన్నత వర్గాలకే చెందిందని, పేద రైతులకు ఒరిగిందేమిలేదన్నారు. రైతుల బ్రతుకులు బాగుపడాలంటే బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి రావాలన్నారు. బీఎల్‌ఎఫ్‌ పార్టీ గుర్తు రైతుపట్టిన నాగలి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని అభ్యర్థించారు. అనంతరం కేసముద్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాలకు హాజరై భోజనం చేసి వారితో మాట్లాడారు. కాగా రాంసింగ్‌తండాకు చెందిన నరేష్‌, పాండు, వీరన్న, నరేందర్‌తో పాటు 70 మంది యువకులు బీఎల్‌ఎఫ్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెవిటి ఐలయ్య, వెంకన్న, ఉపేందర్‌, సిద్దు, కొమురయ్య, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.