ముందస్తు ఎన్నికల వల్లే పోటీ చేయడం లేదు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్,నవంబర్19(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. అయితే, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీకి బరిలో నిలవడం ఒకింత కష్టతరమని భావించి పోటీ విరమించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. లోక్సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందని ప్రకటనలో స్పష్టంచేశారు.