ముగిసిన క్రికెట్‌ కోచ్‌ అచ్రేకర్‌ అంత్యక్రియలు

హాజరైన టెండూల్కర్‌ తదితరులు
ముంబై,జనవరి3(జ‌నంసాక్షి):  క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. చిన్ననాటి కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ బుధవారం కన్నుమూయగా గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.  ఆయన భౌతిక కాయానికి పలువురు నివాళి అర్పించగా ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో పాల్గోనేందుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌తో పాటురాజ్‌ థాకరేలు.. అచ్రేకర్‌ ఇంటికి వచ్చారు. గత కొంతకాలంగా అచ్రేకర్‌ వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 1932లో జన్మించిన అచ్రేకర్‌ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా సవ్యంగా సాగలేదు. 1943లో క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన రమాకాంత్‌.. 1945లో న్యూ హిందు స్పోర్ట్స్‌ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత యంగ్‌ మహారాష్ట్ర ఎలెవన్‌, గుల్‌ మెహర్‌ మిల్స్‌, ముంబై పోర్టు తరఫున ఆడాడు. 1963-64లో మొయనుద్దౌలా టోర్నీలో ఆలిండియా స్టేట్‌ బ్యాంక్‌ తరఫున హైదరాబాద్‌పై ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. తర్వాత కొంతకాలానికి దాదర్‌లోని శివాజీ పార్క్‌లో కామత్‌ క్రికెట్‌ క్లబ్‌ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సచిన్‌, కాంబ్లీ, ప్రవీణ్‌ ఆమ్రె, అగార్కర్‌, బల్వీందర్‌ సింగ్‌ సంధూ, సవిూర్‌ దిఘేలాంటి ఎంతో మంది క్రికెటర్లకు కోచింగ్‌ ఇచ్చినా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు తెచ్చింది మాత్రం టెండూల్కరే. క్రికెట్‌లో అసమాన
సేవలందించినందుకు 1990లో ద్రోణాచార్య, 2010లో పద్మశ్రీ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ముంబైలోని జింఖానా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ సుదీర్ఘంగా కొనసాగడంలో అచ్రేకర్‌ పాత్ర ఎనలేనిది.