ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): కడప చిన్నచౌక్‌ పోలీసులు ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 113 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కడప డీఎస్పీ మాసూమ్‌ భాషా విూడియా ఎదుట హాజరు పరిచారు. చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన శరత్‌ కుమార్‌, మదనపల్లికి చెందిన నరేశ్‌, కడపకు చెందిన వంశీకృష్ణలు జల్సాలకు అలవాటు పడి సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలని పలుచోట్ల గొలుసు చోరీలకు పాల్పడ్డారు. వీటితో పాటు తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముగ్గురునీ కడప ఆర్టీసీ బస్డాండ్‌ వద్ద అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో చోరీలకు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.