మున్సిపల్‌ ఎన్నికలకు సిపిఐ సిద్దం: కూనంనేని

ఖమ్మం,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులుంటాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీకి సిద్దంగా ఉన్నామని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలే తమ ప్రచార ఎజెండా అన్నారు. కెసిఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్రజల్లో ఎండగడుతామని అన్నారు. దిశ హత్యపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలుచేసిన ఆధునిక పోలీస్‌ వాహనాలు ప్రజల రక్షణకు ఉపయోగపడడం లేదని రుజువయ్యిందన్నారు. సకాలంలో పోలీసులు చేరుకొని ఉంటే దిశ అంతటి అఘాయిత్యానికి గురయ్యేదేకాదన్నారు. మహిళలపై, విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులపై కాల్చి పారేయాల్సిందేనన్నారు. వరంగల్‌ యాసీడ్‌ ఘటనపై నిందితుడిని ఎలా కాల్చి చంపారో అదే విధంగా చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దిశ సంఘటన విషయంలో మంత్రులు కొందరు బాధ్యతా రహితంగా మాట్లాడటం శోచనీయమన్నారు.