ముస్లింల గురించి ఆలోచించే..  ఏకైక నేత కేసీఆర్‌’


– ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం
– తెలంగాణను కాంగ్రెస్‌ నాశనం చేసింది
– కేసీఆర్‌ వల్లనే తెలంగాణ వచ్చింది
– ఆపద్ధర్మ మంత్రి, డిప్యూటీ స్పీకర్‌ మహమూద్‌ అలీ
మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ మనల్ని ఉపయోగించుకుని.. ఆ తర్వాత మరచిపోయిందని ఆపద్ధర్మ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలోబుధవారం   నిర్వహించిన ముస్లింల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 1948 నుంచి 2004 వరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఒక్కసారి కూడా ముస్లింల రిసర్వేషన్‌ గురించి మాట్లాడ లేదన్నారు. పార్లమెంట్‌ లో రిజర్వేషన్ల కోసం టీఆర్‌ఎస్‌ పోరాటం చేసినా.. కాంగ్రెస్‌
సహకరించలేదని అన్నారు. ముస్లింల గురించి ఆలోచించే ఏకైక నేత కేసీఆర్‌ మాత్రమేనని అలీ పేర్కొన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్న ఆయన.. రిజర్వేషన్‌ పక్రియల అమలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మేలని అన్నారు. తెలంగాణలో హిందూ ముస్లింలు గంగా యమున సంగమంలా కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పిన అలీ.. ముస్లింలకు అత్యుత్తమ విద్య అందించడానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వివరించారు. ముస్లింల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారుని, షాదీ ముబారక్‌ ద్వారా ముస్లిం యువతుల వివాహానికి రూ.1,00,016లు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేసిందని మహముద్‌ అలీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ రాలేదని, కేసీఆర్‌ వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. కచ్చితంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు.