మూడేళ్లు లైసెన్స్‌ రద్దు చేయండి

-అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణు
అమరావతి, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఆటోల్లో ఓవర్‌ లోడింగ్‌తో వెళ్లడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పలువురు శాసన సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇందుకు సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు మాట్లాడుతూ.. ‘ యూఎస్‌, ఇతరత్రా దేశాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండి కూడా తప్పులు చేస్తే దానికి పాయింట్స్‌ సిస్టమ్‌ పెట్టి లైసెన్స్‌ రద్దు చేసే సిస్టమ్‌ ఉంది. ఈ మధ్య రాత్రి సమయాల్లో విశాఖ బీచ్‌ రోడ్స్‌లో స్పీడ్‌ డ్రైవింగ్‌, స్నేక్‌ డ్రైవింగ్‌ ఇలా పలురకాల విన్యాసాలతో రోడ్లపై వెళ్లే అమాయక ప్రజలను చంపేస్తున్నారు. తప్పుచేసిన వారికి మూడేళ్లపాటు లైసెన్స్‌ బ్యాన్‌ చేయండి. ఇలా ఏదో ఒకటి చేయకపోతే అమాయకమైన ప్రజలను చంపేసే పరిస్థితి ఉంది. లైసెన్సింగ్‌ ఆఫ్‌ అథారిటి ఇలాంటి వాటిపై దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకు స్పందించిన స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ విూ సలహాలు, సూచనలు చాలా బాగున్నాయని ప్రశంసించారు.