మేం మోసం చేయలేదు: ఎంపీ కవిత

 హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని అంటున్నారు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత. ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో తెరాస ముందంజలో ఉంది. ఈ విషయం గురించి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లాగా తెరాస ఎలాంటి మోసానికి పాల్పడలేదు. గత నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం పాలన చూసే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మా ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మావైపే ఉంటారన్న నమ్మకం ఉంది. మాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ప్రజల కోసం పనిచేశాం. అందుకు బదులుగా ఓటర్లు మమ్మల్ని మరోసారి ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం. అది కూడా ఏకగ్రీవంగానే. ఈ విషయంలో మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మాపై, మా పాలనపై ఇతర పార్టీలు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేవు’ అని వెల్లడించారు కవిత.