మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కలెక్టర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ శాఖల సమన్వయం, సహకారంతో లక్షల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక జాగత్తలు తీసుకుని ట్రీగార్డ్స్‌తో పాటు గ్రీన్‌బ్రిగేడ్స్‌ ద్వారా నీటి సరఫరా చేపట్టారు. ఈ చర్యలతో జిల్లా నుంచి కరువును పారదోలి సస్యశ్యామలం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఇటీవలి వర్షాలకు అవి మొలకెత్తనున్నాయి. అంతేగాక వాటిని కొండలు, గుట్టలు, సాగుకు అనువుగా లేని ప్రాంతాల్లో వేయడంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించడం అభినందనీయం. విత్తన బంతుల తయారీలో రాష్ట్రంలోనే కాక దేశంలోనే జనగామ జిల్లా అగ్రగామిగా ఉంది.