మోడ్రన్ ఈస్టిండియా కంపెనీ
మహాకూటమిపై ఓవైసీ విసుర్లు
సంగారెడ్డి,నవంబర్5(జనంసాక్షి): కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ‘ఈస్ట్ ఇండియా కంపెనీ 2018’గా పోల్చారు. తెలంగాణ మిశ్రమ సంస్కృతిని నాయుడు (చంద్రబాబు) కాపాడతారా? పోనీ కాంగ్రెస్ కాపాడుతుందా? ఇది మహాకూటమి కాదు…2018 ఈస్ట్ ఇండియా కంపెనీ’ అని సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ అన్నారు. తెలంగాణ ప్రజలే రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకుంటారని, ఎక్కడో నివసించే వ్యక్తులు కాదని అన్నారు. ‘నాయుడు విజయవాడలో ఉంటారు. ఆర్ఎస్ఎస్ నాగపూర్లో ఉంటుంది. కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటుంది. వీళ్లా తెలంగాణ, తెలంగాణ ప్రజల తలరాతను నిర్ణయించేది?’ అని ఒవైసీ ప్రశ్నించారు. ఈ మోడ్రన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ్నించి వచ్చిందో అక్కడికి పంపించేలా డిసెంబర్ 7న ప్రజలు తీర్పునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 11న ఫలితాలు వెల్లడవుతాయి.