యాదాద్రిలో లక్షపుష్పార్చన

యాదాద్రి భువనగిరి,నవంబర్‌11(జనంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రిక్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. ఈ లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.