రంజీ క్రికెటర్‌ హర్మీత్‌సింగ్‌ బద్దన్‌ అరెస్టు

20brka77a-railకారులో రైల్వే ప్లాట్‌ఫామ్‌ పైకి.. క్రికెటర్‌

అంధేరీ: ముంబయి అంధేరీ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఒక కారు నేరుగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైకి దూసుకురావటం గందరగోళాన్ని సృష్టించింది. ఈ ఘటనలో రంజీ క్రికెటర్‌ హర్మీత్‌సింగ్‌ బద్దన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం రద్దీగా ఉన్న అంధేరీ రైల్వేస్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి ఒక ద్రాక్ష పండు రంగు హ్యుందయ్‌ వెర్నా కారు దూసుకొచ్చింది. దీంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులయ్యారు. ప్లాట్‌ఫామ్‌పై పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు డ్రైవింగ్‌ సీట్లో ఉన్న హర్మీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసులో హర్మీత్‌ దోషిగా తేలితే మూడేళ్లవరకు జైలు శిక్షపడవచ్చు.

ఈ ఘటనపై రైల్వేస్టేషన్‌ ఎస్‌ఐ మోనీష్‌ రాథోడ్‌ మాట్లాడుతూ హర్మీత్‌ బాంద్రా నుంచి మలాడ్‌ వెళ్తూ పొరబాటున మలుపు తీసుకోవడంతో స్టేషన్‌లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. గత నవంబర్‌లో కూడా ఒక ఇన్నోవా కారు ఇదే రైల్వే స్టేషన్‌ ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పైకి ఇలాగే దూసుకొచ్చింది.