రచ్చ రాజకీయాల్లో మునిగిన విపక్ష పార్టీలు

విభజన తరవాత వచ్చిన కష్టనష్టాల గురించి చర్చ జరగాలి. ఏది మంచిదో ఏది మంచిది కాదో చర్చించుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఇరు తెలుగు రాష్టాల్రకు మేలు జరుగుతుంది. రాజకీయ నేతలకు విశాల హృదయం ఉండి దార్శనికత అవసరం. కావేరి జలాల విషయమే తీసుకుంటే తమిళనాడు, కర్నాటకల మధ్యచిచ్చు రేపుతోంది. జలాల పంపిణీలో కూడా ఇరు రాష్టాల్ర మధ్య సామరస్యం లేకపోవడం, జాతీయ జలవిధానం లేకపోవడం కారణంగా భావించాలి. అలాగే విడిపోయాక తెలంగాన, ఎపిల మధ్య ఇలాంటి చిచ్చు రెచ్చగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్‌, వైకాపాలు ముందుకు నడిచాయి. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలు ఎటూ తేలకుండానే అంతా తెలంగాణ దోచేస్తుందన్న రీతిలో ఎపి నేతలు హైరానా చేశారు. నిజానికి ఇంతకాలం ఇక్కడా వారే ఉన్నారు. అయినా ఎందుకు ఇలా రచ్చ చేస్తున్నారంటే రాజకీయం తప్ప మరోటి కాదు. విభజన సందర్భంలో ఇలాంటి రచ్చ చేసి, ఎపికి కావాల్సిన,రావాల్సిన విషయాలపై పట్టుబట్టక పోవడంతో తీవ్రంగా నష్టపోయారు. నిజానికి ఆనాడే విడిపోతే మా గతేంకాను అని గట్టిగా కేంద్రాన్ని నిలదీసి ఉంటే ఇవాళ ఇంత దౌర్భాగ్యం ఉండేది కాదు. ఇప్పుడు ప్రత్యేక ¬దా విషయంలోనూ ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటుపడిన విపక్ష రాజకీయ నాయకులు ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా లభించే అవకాశం లేదని కేంద్రం పదేపదే చెప్పి ప్రత్యేకప్యాకేజీని ప్రకటించినా ఇంకా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో వైకాపా తీరు దారుణంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకోసం అందివచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టి నానాయాగీ చేసి అసెంబ్లీలో బలప్రదర్శన కు దిగారు. దీనివల్ల ప్రచారం జరగవచ్చు గానీ ప్రజలకు చర్చ ద్వారా విషయం తెలుసుకునే అవకాశం లేకుండా చేశారు. విపక్షం అంటే నిర్మాణాత్మక చర్చ చేయాలి. అదే పనిగా విమర్శలు చేస్తే సరికాదు. ప్రత్యేక¬దాపై జగన్‌ చేస్తున్న విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ప్రతిదీ భూతద్దంలో చూసి చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు కూడా ఉచ్చనీచాలు మరచి తాముపట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నరీతిలో సాగుతున్నారు. ప్రత్యేక¬దా అంటే మంత్రదండం అన్న రీతిలో ప్రచారం చేసుకునే కుత్సిత రాజకీయాలు నడపడం ప్రజలను వంచించడం తప్ప మరోటి కాదు.

ఇటు తెలంగాణలో కూడా ఇదే తరహా రాజకీయాలు నడుపుతున్నారు. జలయజ్ఞం పేరుతో వేలకోట్లు దోపిడీ చేసిన వారు ఇప్పడు మల్లన్న సాగర్‌పై నానాయాగీ చేస్తున్నారు. తమ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారు. పదేళ్లు పాలనచేసి పాపాలను వదిలిన కాంగ్రెస్‌ పార్టీ వారు ఆందోళన చేయడం దారుణం. నిజానికి వారుచేసిన పాపాలకు వారిని రాజకీయంగా వెలి వేయాలి. ప్రత్యేక¬దా అంటే ఏమిటి? దానివల్ల ఒనగూడే ప్రయోజనాలు ఏమిటో తెలియని వారు కూడా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ¬దా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేశారు. పన్ను రాయితీలు ప్రకటిస్తేనే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పన్ను రాయితీల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు విభజన సమయంలోనే ఎందుకు చట్టం చేయలేదో చెప్పలేరు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ల్రో వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి పన్ను రాయితీలు ఇవ్వాలని బిల్లులో ఎందుకు పెట్టలేదంటే సమాధానం లేదు. వారు సక్రమంగా విభజన చట్టం తయారు చేసివుంటే ఇవాళ ఇంతగా రచ్చ సాగేది కాదు. అంటే యాగీ చేయడం కోసం ఇదంతా ఓ ఎత్తుగడగా భావించాలి. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రాహుల్‌ ప్రధాని అవుతారని, తెలంగాణ తమ వశం అవుతుందని వేసుకున్న లెక్కలు ఇప్పుడు వారికి ముల్లులా గుచ్చకుంటున్నాయి. ¬దా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని ఊదరగొడుతున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఏపీలో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలకు భూసేకరణను అడ్డుకోవడం చూస్తుంటే వారి కపట రాజకీయాలు అర్థం కానివి కావు.

మచిలీపట్నం పోర్టుకు ఆమోదముద్ర వేసింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి. అయినా ఇప్పుడు పోర్టుకు అవసరమైన భూముల సేకరణకు అడ్డుపడుతున్నది జగన్‌ నేతృత్వంలోని వైకాపా, లెఫ్ట్‌ పార్టీలు కాదా? పరిశ్రమలు రావాలంటున్న వారు భూసేకరణను ఎలా అడ్డుకుంటారు. ప్రాజెక్టుల పేరుతో జలయజ్ఞం చేసిన వారు భూసేకరణను ఎలా అడ్డుకుంటారు. బెదిరింపు రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టులు నీతులు పలకడం దారుణం కాక మరోటి కాదు. రచ్చ రాజకీయం చేయడం తప్ప కమ్యూనిస్టులకు తెలిసింది శూన్యం. అలాంటి నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంతో కలసి పరిశ్రమలు రావాలనడం విడ్డూరంగా ఉంది. రాజకీయ ప్రయోజనాలే ఆయా పార్టీలకు ముఖ్యం అని గమనించాలి. ప్రత్యేక ¬దాతోపాటు పన్ను రాయితీలు అంటూ యాగీ చేస్తున్న వారికి కనీస పరిజ్ఞానం లేదు. ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఎపికి ఊరట దక్కుతుంది. దీనికోసం మద్దతు తెలిపి అభివృద్దిలో భాగం కావాలే తప్ప అడ్డుపడే రాజకీయాలు చేయరాదు. అసెంబ్లీలో నిజంగానే ప్రత్యేకప్యాకేజీపై చర్చ చేసివుంటే జగన్‌ సమర్థత తెలిసేది. కానీ అడ్డుకునే ధోరణి కారణంగా ఆయన తమకు వచ్చిన ఓ మంచి అవకాశాన్ని మిస్‌ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎంతగా చర్చ చేస్తే అంత మంచి నేతగా ఎదగలరు. ఈ విషయంలో కెసిఆర్‌ ప్రజల్లో బాగా చర్చ చేయడం వల్లనే సక్సెస్‌ అయ్యారు.