రహదారులే అభివృద్ధికి చిహ్నాలు

– అటల్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
రోహ్‌తగ్‌,అక్టోబరు 3(జనంసాక్షి):అటల్‌ సొరంగ మార్గ నిర్మాణంతో మాజీ ప్రధాని వాజ్‌పేయీ కల సాకారమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఫిర్‌ ఫంజల్‌ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఇవాళ చరిత్రాత్మకమైన రోజు. హిమాచల్‌ ప్రజల దశాబ్దాల ఎదురుచూపులు నేడు ఫలించాయి. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గాన్ని నిర్మించాం. వాజ్‌పేయీ స్వప్నాలను మేం సాకారం చేశాం. అటల్‌ సొరంగ మార్గంతో కోట్లాది మంది స్థానికులకు ప్రయోజనం కలుగుతుంది’ అని అన్నారు. ఈ సొరంగంతో సరిహద్దులకు అదనపు బలం చేకూరుతుందని మోదీ తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్‌ ఎంతో సహకరిస్తుందన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సొరంగాన్ని పూర్తి చేశారన్న మోదీ.. ఇందుకు పనిచేసిన అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ‘2013-14 నాటికి కేవలం 1300 విూటర్ల మేర మాత్రమే సొరంగ నిర్మాణం జరిగింది. ఇలాగే కొనసాగితే 2040 నాటికి సొరంగ నిర్మాణం పూర్తవుతుందని నిపుణులు అన్నారు. కానీ మేం అధికారంలోకి వచ్చాక ఎంతో వేగంగా నిర్మించాం. 26ఏళ్లలో జరగాల్సిన పనిని ఆరేళ్లలో పూర్తి చేశాం. దీని వల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. స్థానిక ప్రజలకు ప్రయాణ దూరం తగ్గుతుంది. హిమాచల్‌ ప్రజలకే కాకుండా లేహ్‌-లద్దాఖ్‌లకు కూడా ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం’ అని మోదీ చెప్పారు. అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సొరంగం దేశ ఆర్థిక, వాణిజ్య అవసరాలు తీరుస్తుంది. ఆహార పదార్థాలు, వాణిజ్య సరకుల రవాణా సులభతరం అవుతుంది’ అని అన్నారు. సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు ఈ సొరంగ మార్గాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.