రాజకీయ సంకల్పబలం కావాలి

రాజ్యంగాన్ని సిద్దం చేసుకుని అమలు చేసుకుంటున్న వేళ అది ఎంతవరకు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమన్యాయం అందుతుందా అన్నది చూడాలి. నేలవిడిచి సాము చేసే విధంగా దేశీయంగా ఉత్పత్తులపై దృష్టి పెట్టి స్వయం సమృద్ది సాధించకుండా దావోస్‌ లాంటి వేదికలపై పెట్టుబడులకు వెంపర్లాడుతున్న విధానం పోవాలి. దేశీయంగా ఉన్న సాంకేతి కతను ఉపయోగించుకుని యువతను స్వయం సమృద్దికి సన్నద్దం చేయాలి. వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ది చేస్తే ఈ దేశం ఇతర దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలదు. సింగపూర్‌, మలేషియా తదితర చిన్నదేశాలను ఆదర్శగా తీససుకుని ఆయా రాష్టాల్రు స్వయం సమృద్ది సాధించే ప్రణాళికలతో సాగాల్సిన అవసరాన్ని ఈ గణతంత్రం రోజు ప్రతిన తీసుకోవాలి. ఇకపోతే 70ఏళ్లుగా గణతంత్రం సరిగా అమలు కావడం లేదు. రిజర్వేషన్ల గొడవలు ఎక్కువయ్యాయి. ప్రజలు సంపూర్ణత సాధించేలా పథకాలు అమలు కావడం లేదు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఆరోగ్యం అందని ద్రాక్షగా మారింది. విద్య విలాసవస్తువుగా మారింది. ఇలాంటి అసమనాతలను రూపుమాపేందుకు పాలకులు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిత్రంలోనే ముంచెత్తుతున్న వేళ పాలకులు గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన వేళ ఇది. జెండా ఎగుర వేయడమే గాకుండా ప్రజల కోసం పరితపించేలా పాలన సాగిస్తామని ప్రతిన చేయాల్సిన సమయమిది. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. విద్యావైద్య రంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. ఆహారధన్యాలను ఇంకా ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో పాలన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది. ఐదేళ్లు అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడ మెలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత్‌ 70 ఏళ్ల తరవాత కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. ఈ 70 ఏళ్ల వైఫల్యాలపై పాలకులు ఆత్మపరిశీలన చేసుకునే సమయమిదే. రాజకీయాలను పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సిన సమయ మిది. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతు న్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటోంది. ఈ పరిస్థితిని నివారించకుండా ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రం లభిస్తోంది. ఎన్నికల్లో ఆయా పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైనం చూస్తున్నాం. అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం. మనం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్టాల్ర సిఎంలే ఇప్పుడు దాని బారినుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అదిచూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన కేంద్రం ప్రభుత్వం మొడిగా వ్యవహరిస్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును సొంత అవసరాలకు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడటాన్ని గ్రామాల్లో ఇప్పటికీ చూస్తున్నాం. నగదు ఉపసంహరణపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఉల్లిపాయల ధర మరోమారు 40రూపాయలకు చేరుకుంది. ఇలా రాజకీయ పార్టీలకు అధికారమే తప్ప ప్రజలు కనబడడం లేదు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్‌ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతోంది. రాజకీయాల్లో ఎదుటి పక్షాలను ఢీకొట్టేందుకు తమ తెలివిని ఉపయోగిస్తున్న పాలకులు ప్రజల సమస్యలు పరిష్కరించడం లో శ్రద్ద చూపడం లేదు. ఈ దశలో ఇలాంటి ప్రజాస్వామ్యం కొనసాగితే మరో 70 ఏళ్లయినా మన భారత్‌ రాత మారదు. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. అప్పుడే ప్రజలకు స్వాతంత్య్ర ఫలం దక్కుతుంది. అప్పుడే భారత్‌ ఉజ్వలంగా వెలుగుతుంది. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విసలాలకు ఖర్చు చేసుకుంటున్నారు. ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక, ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడతాయని ఈ 70 ఏళ్లలో నిరూపితం అయ్యింది. ఆ క్రమంలోనే ఖర్చు వందలు, వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది. దేశంలో ఇప్పటికీ సరైన ప్రాజరోగ్య వ్యవస్థ లేదు. వ్యవసాయరంగం కుంగి కృషించిపోతోంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆహారధాన్యాలకు మద్దతు ధరలు అందడం లేదు. విద్య మిధ్యగా మారింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. ఈ అసమానతల తొలగింపునకు రాజకీయ సంకల్పం బలంగా ఉండాలి. అలాంటి నాయకులు రావాలి. అలాంటి వారితోనే ఈ దేశం బాగుపడుతుంది తప్ప అప్పటి వరకు గణతంత్రాలు ఎన్నయినా మార్పు రాదు.