రాజధాని తరలింపు వార్తల్లో నిజంలేదు

– బొత్స ఎక్కడా రాజధాని తరలిస్తారని చెప్పలేదు
– ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
– బీజేపీ పచ్చ పుష్పాలతో నిండిపోయింది
– పార్టీ నాయకత్వం పచ్చ పుష్పాలతో జాగ్రత్తగా ఉండాలి
– కృష్ణానదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా?
–  జగన్‌పై హిందువు వ్యతిరేక ముద్ర వేసేందుకు కుట్ర
– వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
అమరావతి, ఆగస్టు21 (జనంసాక్షి):   ఏపీ రాజధానినిన అమరావతి నుండి వేరే ప్రాంతానికి తరలింపు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాజధానిని తరలిస్తారని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని తేల్చారు. మంత్రి బొత్స ఎక్కడా రాజధానిని తరలిస్తారని చెప్పలేదని, కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం సరికాదని శివరామ కృష్ణ కమిటీ చెప్పిందని, అయినా వినకుండా చంద్రబాబు అమరావతిలో రాజధాని నిర్మాణం చేశారన్న విషయాన్ని మాత్రమే మంత్రి బొత్స ప్రస్తావించారని అన్నారు.
రాజధాని వివాదం ఏం లేదని.. అమరావతిని మార్చేయబోతున్నట్లు ఇష్టం వచ్చినట్లు కథనాలు రాయడం సరికాదని అన్నారు. మంత్రి ఎక్కడైనా అమరావతిని మారుస్తున్నామని, తరలిస్తున్నారని చెప్పారా అంటూ అంబటి ప్రశ్నించారు. అమరావతి గురించి మేనిఫెస్టోలో చెప్పాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై బయట జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని ఏవైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే స్పష్టంగా చెబుతామని ఆయన అన్నారు. వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని అన్నారు. నాగార్జునసాగర్‌ గేట్లు మూసేసిన తర్వాతనే విజయవాడకు
తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. బాబు ధోరణి చూస్తుంటే వరదలతోనూ సానుభూతి పొందాలన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి నొప్పి వల్లే ఆయన హైదరాబాద్‌ వెళ్లినట్టు చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్లు లేరా.. చేయినొప్పికే అక్కడిదాకా వెళ్లాలా అని ప్రశ్నించారు. బాబు హైదరాబాద్‌ వెళితే మరి లోకేష్‌ ఎక్కడికి వెళ్లారని అంబటి ప్రశ్నించారు. నదీగర్భంలో ఉంటూ ఇల్లు ముంచేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, పేపర్లలో రాయించుకుంటున్నారని, కృష్ణానదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా అని అన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీడీపీ హయాంలో దేవినేని ఉమా ప్రకటించారు కదా.. మరేమైందని ప్రశ్నించారు. ఎన్ని కూల్చేశారు.. ఏ అక్రమ కట్టడానికైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తామన్నారో.. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారని అన్నారు.
అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని హిందూ వ్యతిరేకి అంటూన్నారని,  వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడ్డం నేరమన్నారు. అక్కడ ఎలక్టాన్రిక్‌ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారని, ఆయనా అదే చేశారని, కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని బొత్స విమర్శించారు.