రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం

భూ తగాదాల్లో తండ్రీకొడుకుల హత్య

రాజన్న సిరిసిల్ల,జూన్‌12(జ‌నం సాక్షి ): భూ తగాదాలు తండ్రీకొడుకులను బలితీసుకున్నాయి. ప్రత్యర్థులు వీరిని హతమార్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌లో మంగళవారం ఉదయంఈ దారుణం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతులు తండ్రి ఎల్లయ్య, కొడుకు శేఖర్‌గా గుర్తించారు. భూ తగాదాల కారణగా తండ్రీ కొడుకులు దారుణహత్యకు గురయ్యారని స్థానికులు అన్నారు. ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లి గ్రామంలో మంగళవారం వేకువజామున జరిగిన జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. గ్రామానికి చెందిన చామనపల్లి ఎల్లయ్య (55), అతని కొడుకు శేఖర్‌(25)ను అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు ఉదయం పొలం దున్నుతుండగా గొడ్డలితో దాడి చేసి హతమార్చారు. ఎకరం పొలం విషయంలో అదే గ్రామానికి చెందిన కొందరితో ఎల్లయ్య కుటుంబానికి కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేకువజామున 5 గంటల ప్రాంతంలో తండ్రీకొడుకులను పొలంలోనే హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ హత్యల్లో నలుగురు పాల్గొనగా.. ముగ్గురు పోలీసులకు లొంగిపోయారు. మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలకు భూవివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.