రానున్న రోజుల్లో మరో శ్వేత విప్లవం: లోక భూమారెడ్డి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అందరి సహకారంతోనే విజయ డెయిరీకి ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సమ్మిట్‌ 2019 అవార్డు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణ మరొక శ్వేత విప్లవానికి విజయ డెయిరీ నాంది పలకబోతుందన్నారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. విజయ డెయిరీకి జాతీయ అవార్డు రావడంతో లోక భూమారెడ్డిని  టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత, ఆహార నాణ్యత రంగంలో విజయ డెయిరీకి జాతీయ స్థాయి అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఈ ఆవార్డు సాధ్యమైందన్నారు. పాడి రైతుల సంక్షేమం, శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ రూపొందిస్తున్న పాడి బర్రెల పంపిణీ పథకాన్ని మా సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు పరుస్తున్నామన్నారు.