రావత్‌ సమర్థతకు పరీక్షా కాలం 

తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సీఈసీగా బాధ్యతలు చేపట్టబోతున్న ఓంప్రకాశ్‌ రావత్‌ గురుతర బాధ్యతను చేపట్టాల్సి ఉంది. ఓ వైపు బాధ్యతలు తీసుకుంటూనే తన ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా భారత ఎన్నికల సంఘం పరువు నిలపాల్సి ఉంది. అలాగే బాద్యత పెంచాల్సి ఉంది. రాజకీయ నాయకుల తొండాటకు చెక్‌ పెట్టాల్సి ఉంది. తాజాగా అప్‌ ఎమ్మెల్యేలపై వేటు, రానున్న ఎన్నికల్లో సమర్థంగా వ్యవహరించడం, ఇప్పటికే అనేక కేసులు ఇసి ముందున్న వాటని పరిష్కరించిడంలో రావత్‌ సమర్థత ప్రదర్శించాల్సి ఉంది. ఇవన్నీ చేస్తారా లేదా అన్నది ఆయన సమర్థతను బట్టి ఆధారపడి ఉంది. మన ప్రజాస్వామ్య వ్వవస్థలో ఉన్న అనేకానేక లొసుగులను ఆధారం చేసుకుని రాజకీయ నాయకులు వాటిని తమకు అనుకూలంగా మలచకుంటూ రాజ్యమేలుతున్నారు. ఇలాంటి విన్యాసాలు ఇక సాగవని రావత్‌ నిరూపించిల్సిన అసవరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా ఉన్నా పదవిలో ఏకే జ్యోతి సోమవారం పదవీవిరమణ చేయనున్నారు. ఇప్పుడు కమిషనర్‌గా ఉన్న ఓంప్రకాశ్‌.. మంగళ వారం సీఈసీగా బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఓంప్రకాశ్‌ గతంలో భారీ పరిశ్రమల శాఖలోని ప్రభుత్వసంస్థల విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు రక్షణశాఖలోనూ డైరెక్టర్‌గా సేవలందించారు. జ్యోతి పదవీ విరమణతో ముగ్గురు సభ్యులుం డాల్సిన ఎన్నికలసంఘంలో ఓ స్థానం ఖాళీ అవుతోంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు.. ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి అశోక్‌ లవాసాను ఎన్నికల కమిషనర్‌గా కేంద్రం నియమించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో సీఈసీగా ఓంప్రకాశ్‌ పదవీకాలం ముగుస్తుంది. తదనంతరం ఎన్నికల సంఘంలోని మరో సభ్యుడు సునీల్‌ అరోరా.. ఈ బాధ్యతలను తీసుకునే అవకాశముంది. అయితే కొద్దికాలమే పదవిలో ఉండాల్సి ఉన్నందున రావత్‌ తన సత్తా చాటాలి. ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, రాష్ట్రపతి దానిని ఆమోదించిన తరుణంలో రావత్‌ మరింత కఠినంగా వ్యవహరించి ఇసి ప్రతిష్టను నిలపాలి. ఎన్నికల నిబంధనలు తుంగలో తొరక్కడమో లేక అప్రజాస్వామికంగా పార్టీలు మారడమో చేస్తున్న ప్రజాప్రతినిధుల పైనా వేటు వేయడం ద్వారా భారత ఎన్నికల సంఘం ప్రతిష్టను పెంచాలి. టిఎన్‌ శేషన్‌లాగా గట్టిగా వ్యవహరిస్తే తప్ప మన ప్రజాస్వమ్య వ్యవస్థ మనుగడ సాగించదు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలపై ఇసి అనర్హత వేయడం, దానిని రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదించడం అన్నది ఇసి చరిత్రలో ఓ విప్లవాత్మకమైన నిర్ణయం.రాజ్యాంగ విరుద్ధంగా లాభదాయక పదవులు చేపట్టిన వీరంతా ఎమ్మెల్యేలుగా అనర్హులని తేల్చిచెబుతూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి నివేదిక పంపింది. జోడు పదవులు అనుభవిస్తున్న వీరిని అనర్హులుగా ప్రకటించాలా? అంటూ ఈసీని గతంలో ప్రశ్నించిన రాష్ట్రపతి ఇకపై చేయబోయే నిర్ణయంపై ఢిల్లీ రాజకీయం ఆధారపడివుంది. కేజీవ్రాల్‌ ప్రభుత్వం కుప్పకూలబోతున్నదా, మధ్యంతర ఎన్నికలు వస్తాయా, వాతావరణం ఎవరికి అనుకూలంగా ఉన్నది ఇత్యాది అంశాలపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎన్నికల కమిషన్‌ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించిన దరిమిలా సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇది ప్రజాస్వామ్య బద్దంగానే తీసుకున్న చర్యగా ఇసి పేర్కొంది. అలాంట ప్పుడు అనేక కేసులను కూడా సత్వరంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం ద్వారా ఇసి ప్రతిష్టను పెంచాలి. లాభదాయక పదవులను నిర్వహించినందుకు ఆ పార్టీకి చెందిన ఒక మంత్రి సహా 20 మంది శాసనసభ్యుల పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అనర్హత వేటు వేశారు. ఎన్నికల సంఘం ఈ మేరకు చేసిన సిఫార్సుపై శనివారం ఆయన సంతకం చేసినట్లు ఆదివారం న్యాయ మంత్రిత్వశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమనీ, ప్రజాస్వామ్యానికి హానికరమనీ ఆప్‌ పేర్కొంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని పార్టీ ఆక్షేపించింది. అన్నివిధాలా తనను వేధించ డానికే కేంద్రం ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆరోపించారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవుల్ని నిర్వహించిన వారందరిపై అనర్హత వేటు వేయడమే సబబని ఈసీ అభిప్రాయపడింది. ఇలాంటి 21 మందిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలిన 20 మంది ఈ ¬దాల్లో ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని దిల్లీ ప్రభుత్వం చెప్పినా ఈసీ విభేదించింది. వారు లబ్ధి పొందారా, ప్రభుత్వ విధుల్లో పాల్గొన్నారా అనేది ప్రాముఖ్యం కాదనీ, నిర్వహించిన పదవి లాభదాయక నిర్వచనం కిందికి వస్తే అనర్హత అనివార్యమనేది జయాబచ్చన్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనీ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈసీ సిఫార్సుపై దిల్లీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. తమ ఆశలన్నీ న్యాయ వ్యవస్థ పైనే ఉన్నాయనీ, కొంత ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నామనీ ఆప్‌ నేలు పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఊరట లభించకపోతే దిల్లీ శాసనసభలో 20 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. 20 ఖాళీలు ఏర్పడినట్లు దిల్లీ శాసనసభాపతి అధికారికంగా ఈసీకి తెలియపరచడం సాంకేతికంగా అవసరం. అప్పుడు 70 మంది శాసనసభ్యులున్న సభలో ఆప్‌ ఎమ్మెల్యేల సంఖ్య 66 నుంచి 46కి పడిపోతుంది.ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యేలు ఇరవైమందిపై ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వెయ్యడం కేజీవ్రాల్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. అయితే ఇంతకన్నా దారుణంగా ఒకపార్టీ నుంచి గెలిచి మరోపార్టీలోకి ఇష్టం వచ్చినట్లుగా మారిన అనేక కేసులు ఇసి ముందు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై తక్షణ చర్య తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ కోర్టుల్లో కూడా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో కొత్త సిఇసి ఎలాంటి చర్య తీసుకుంటాన్నది ఆసక్తిగా ఉంది. ఆయన కఠనంగా ఉంటే కొత్త ఒరవడికి శ్రీకరాం చుట్టిన వారు అవుతారు. లేకుంటే ప్రభావం లేకుండానే పదవీ విరమణ పొందిపన వ్యక్తిగి నిలిచి పోతారు.