రాహుల్‌ పర్యటనతో..

తెరాసలో భయం పట్టుకుంది
– తెరాస నేతలే లోఫర్లు, లుచ్చాగాళ్లు
– కేసీఆర్‌కు రాజకీయ జన్మ కాంగ్రెస్‌లోనే అని కేటీఆర్‌ గుర్తుంచుకోవాలి
– గ్రాఫ్‌ పడిపోతుందనే ముందస్తు ఎన్నికల వ్యూహం
– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
– అవినీతి సొమ్ముకోసమే కాళేశ్వరం రీడిజైన్‌
– మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌
కరీంనగర్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి) : రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంతో కేసీఆర్‌, తెరాస నేతల్లో భయం పట్టుకుందని, అందుకనే మతిభ్రమించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై పొన్నం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార మదంతో అమెరికాలో చిప్పలు కడుక్కునేవాళ్లు మమ్మల్ని లుచ్చాగాళ్లని విమర్శించడం సిగ్గుచేటన్నారు. లుచ్చాగాళ్లం మేము కాదని, కరీంనగర్‌ జిల్లాను ముక్కలు చేసిన విూరే లోఫర్లు, లుచ్చాగాళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విూ తంగ్రి కేసీఆర్‌కు రాజకీయ జన్మ కాంగ్రెస్‌లోనే అనే విషయం గుర్తుంచుకోవావాలని కేటీఆర్‌కు సూచించాడు. విూరు చేసుకున్న ఆరు సర్వేల్లో విూ గ్రాఫ్‌ పడిపోయిందని తెలిసి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల పాలు చేసేందుకు కాదని పొన్న అన్నారు. నాలుగేళ్లలో రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారని పొన్నం విమర్శించారు. ప్రజలను తాత్కాలిక భ్రమల్లో ముంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌, హరీశ్‌ రావు రెచ్చగొట్టడంతోనే ఆత్మహత్యలు జరిగాయని పొన్నం ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏమైందని ప్రశ్నించిన పొన్నం, రాహుల్‌ పర్యటనతో తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో భయం పట్టుకుందన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ అవినీతి కోసమేనని పొన్నం విమర్శించారు. శాతవాహన యూనివర్శిటీకి వీసీని నియమించకపోవడం దారుణం అన్నారు. కరీంనగర్‌ లో మేం చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ వల్లే స్మార్ట్‌ సిటీ వచ్చిందని, టీఆర్‌ఎస్‌ వాళ్లు ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టే రోజులొస్తున్నాయని పొన్నం హెచ్చరించారు. కేటీఆర్‌ చరిత్ర బయట పెడితే బయట కూడా తిరగడలేడని, కేసీఆర్‌ ను మూడు సార్లు గెలిపించిన కరీంనగర్‌ ప్రజలకు ఏం చేశారని పొన్నం ప్రశ్నించారు. ఇప్పటికే ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకొని ప్రజలకు మేలు జరిగేలా పాలన సాగించాలని, లేకుంటే ప్రజలే తరిమికొడతారని పొన్నం తెరాస నేతలను హెచ్చరించారు.