రూ.1000 కోట్ల ప్యాకేజీతో..  ఏపీపై కుట్ర జరుగుతోంది


– ప్రశాంత్‌ కిషోర్‌ సాయంతో కుట్రలు చేస్తున్నారు
– ఏపీలో సామంత రాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే వారి లక్ష్యం
– కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు
– వారి కుట్రల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టండి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌లు ఏపీపై కుట్ర పన్నారని,, రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీలతో కుట్రలు ప్రారంభించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు.. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని మరో బీహార్‌లా మార్చేందుకు ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు. ఏపీలో సామంత రాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే ముగ్గురు మోదీల లక్ష్యమన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పక్షాన నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్‌ను ద్వేషించే కేసీఆర్‌, కేటీఆర్‌లపై జగన్‌
ప్రేమ చూపిస్తున్నారంటున్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ, కేసీఆర్‌, జగన్‌లు కలిసి రూ.1000 కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని.. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కులరాజకీయాలను ఏపీ ప్రజలంతా తిరస్కరిస్తారని.. ఇలాంటివాటిని తెలుగుజాతి అంగీకరించదన్నారు. ఈ కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధప్రదేశ్‌ అభివృద్ధినీ, ప్రజల మంచిని కోరుకునేవారు టీడీపీలో చేరుతున్నారని.. అవినీతి కాంక్షించే వారు వైసీపీవైపు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ఏడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సవిూక్షలు పూర్తిచేశామని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే నిలబెడుతున్నామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు.