రూ.15 లక్షలు ఏడవాయె..

– ఎన్ని లక్షల చార్జిషీట్‌ వేయాలి

– నల్లధనం తెచ్చిండ్రా..

– ఎందుకీ ఉత్తమాటలు

– జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,నవంబరు 22(జనంసాక్షి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చుకుందామనేది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నినాదమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అదే బీజేపీ నినాదం హైదరాబాద్‌ను విద్వేష నగరంగా చేయాలని అన్నారు. హిందూ-ముస్లింలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ కలిసి ఉండనీయొద్దనేది వాళ్ల విధానమన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేపట్టిన ప్రచారం రెండో రోజు కొనసాగుతుంది. ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జహీరానగర్‌లో చేపట్టిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బంజారాహిల్స్‌ నుంచి పోటీ చేస్తున్న గద్వాల్‌ విజయలక్ష్మీ, వెంకటేశ్వర్‌నగర్‌ నుంచి మన్నె కవితారెడ్డి, జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తున్న సూర్యనారాయణలను గతంలో మాదిరి తిరిగి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఆంధ్రా, తెలంగాణ పంచాయతీ అయితదా? హైదరాబాద్‌లో కరెంట్‌ ఉంటదా? ఉద్యోగాలు వస్తాయా? పెట్టుబడులు కొత్తవి కాదుకదా.. ఉన్నవి కూడా పోతయట అని ఇలా నానా రకాలుగా ఆనాడు ప్రచారం చేశారు. మంచినీళ్లకు ఎంత గోస ఉండే. వారం, పద్నాలుగు రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి చూశాం. ఆనాడు కరెంటు ఉంటే వార్తా. ఆరేండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. కరెంట్‌ పరిష్కారం అయింది. మంచినీళ్ల సమస్య పరిష్కారం అయింది. ఇంకో 30 ఏళ్ల వరకు ఇంకా జనాభా పెరిగినా నగరంలో నీటికి సమస్య రాకుండా చుస్తున్నం. రూ. 5కే భోజనం.. పేదవాడి కోసం బస్తీ దావఖానాలు పెట్టాం.

అభివృద్ధి చేస్తున్నందుకా మాపై చార్జిషీట్‌..

కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ నేడు నగరానికి వచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చార్జిషీట్‌ అంటూ ఏవో సొల్లు కబుర్లు చెబుతున్నారు. చార్జిషీట్‌ వేయాల్సింది టీఆర్‌ఎస్‌పై కాదు బీజేపీ ప్రభుత్వంపై అన్నారు. జీరో అకౌంట్‌ తెరవండి రూ. 15 లక్షలు ఇస్తామన్నడు. ఎవరికైనా వచ్చాయా? దేశంలో 132 కోట్ల మంది ఉన్నరు. 132 కోట్ల చార్జిషీట్లు వేయాలి బీజేపీ ప్రభుత్వంపై. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎందుకెస్తవ్‌ మాపై చార్జిషీట్‌.. హైదరాబాద్‌లో అన్నపూర్ణ సెంటర్లు పెంటినందుకా.. గల్లీ గల్లీలో సీసీ టీవీ కెమెరాలు పెట్టినందుకా.. నీళ్ల గోస లేకుండా చేసినందుకా.. సీసీ రోడ్లు వేసినందుకా.. కరెంట్‌ గోస తీర్చినందుకా.. గల్లీ గల్లీలో ఎల్‌ఈడీ లైట్లు పెట్టినందుకా.. హైదరాబాద్‌లో శాంతిని కాపాడినందుకా.. బ్రహ్మండగా పెట్టుబడులు తీసుకువస్తున్నందుకా? ఎందుకు వేస్తవని అడుగుతున్న చార్జీషీట్‌ అని కేటీఆర ప్రశ్నించారు.

డిసెంబర్‌ 4 తర్వాత వరద సాయం పంపిణీ..

దేశంలో ఎక్కడాలేని కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతుంటే దానికి కొంతమందికి కడుపుమండుతుంది. పేదవాళ్లు లగ్గం చేసుకుంటుంటే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ద్వారా రూ.లక్ష 116 ఇస్తున్నం. ఎక్కడన్న వేరే రాష్ట్రాల్లో వస్తున్నయా? బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్రాల్లో ఇస్తున్నారా. కేసీఆర్‌ కిట్టు, చదువుకుంటామంటే రెసిడెన్షియల్‌ స్కూళ్లు, రైతుబంధు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ప్రజలు ఆలోచించాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌లో ప్రజలకు కరోనా కష్టం వస్తే అండగా ఉన్నాం. వరదలు వస్తే ఆదుకున్నాం. ఇంటింటికి తక్షణ సాయంగా రూ. 10 వేలు అందజేసినం. దానికి కూడా బీజేపీ మోకాలడ్డింది. మాటలు, డైలాగులు చెప్పుడే తప్ప కేంద్రం నుంచి ఒక్క పైసా ఇవ్వరు, తీసుకురారు. విషయం లేదు కాబట్టే విషం చిమ్ముతున్నరన్నారు. డిసెంబరు 4 తర్వాత అర్హులైన వారికి రూ. 10 వేలు ఇప్పించే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.