రెండు సీట్లను భారీ మెజార్టీతో గెలుస్తాం: రామలింగారెడ్డి

సిద్దిపేట,మార్చి11(జ‌నంసాక్షి):  ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు ఎంపి సీట్లను టిఆర్‌ఎస్‌ గెల్చుకంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు  భారీ మెజార్టీతో విజయ సాధిస్తారని అన్నారు. సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని దేశ ప్రధాని నరేంద్రమోడీ సైతం కాపీ కొట్టారని ఆయన గుర్తు చేశారు. ఎన్నిక లసంఘం ప్రకటించిన మేరకు వచ్చే నెల11న  జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో సాధించిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీని సాధిస్తామన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎంపీ స్థానాలు కేంద్ర ప్రభుత్వంలో కీలకం కానున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ అనుకున్న తరహాలోనే టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఏ పార్టీలకు లేదన్నారు. సమైక్య పాలనలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కార్యచరణలో అమలు చేసి చూపిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ దేశంలోని ఇతర పార్టీలకు మార్గదర్శకం కానుందన్నారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న సంపూర్ణ విశ్వాసమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల విజయం ఇప్పటికే ఖాయమైందని, అయితే భారీ మెజార్టీని సాధించేందుకే తమ ప్రయత్నమన్నారు.