రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి..

 హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో కారులోనే ఉంచి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అయితే రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో చిన్నారి ఉండటాన్ని స్థానికులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు.

మరోవైపు కారు అద్దాలు మూసి ఉండటంతో పాటు తల్లిదండ్రులు కనిపించకపోవడంతో చిన్నారి ఏడుపు మొదలుపెట్టింది. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో అతికష్టం మీద కారు అద్దాలు పగులగొట్టి పాపను బయటకు తీశారు. పాప క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.