రెండోసారి బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌

– ఎన్నికల్లో.. కన్జర్వేటివ్‌ పార్టీ విజయభేరి

లండన్‌, డిసెంబర్‌ 13(జనంసాక్షి): బ్రిటన్‌లో మరోసారి కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధానిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలపకపోవడంతో ప్రధాని బోరిస్‌ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. మొత్తం 650 సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 326 సీట్లు అవసరం ఉంది. కాగా 540 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. వీటిలో కన్జర్వేటివ్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి మరికొన్ని స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతుంది. దాంతో కన్జర్వేటివ్‌ పార్టీ విజయం దాదాపు కన్ఫర్మ్‌ అయింది. కాగా.. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 191 సీట్లతోనే సరిపుచ్చుకుంది. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధినేత జెరెవిూ కార్బిన్‌ పార్టీ అధినాయకుడి పదవికి రాజీనామా చేశారు. బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తన శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల అభివృద్ధికి కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు మోడీ తన ట్వీట్‌లో తెలిపారు. జాన్సన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయంతో యూకే – అమెరికా మంచి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాయని ట్రంప్‌ పేర్కొన్నారు.