రేవంత్‌కు దొరకని బెయిల్‌

4

– జులై 13 వరకు రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కి ఎసిబి రిమాండ్‌ పొడిగించారు. జూలై పదమూడు వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున రేవంత్‌ రెడ్డి రిమాండ్‌ పొడిగించాలని ఎసిబి మెమో దాఖలు చేసింది.ఈ మెమో మేరకు రిమాండ్‌ పొడిగించారు. ఇదిలావుంటే ఆయన బెయిల్‌పై మంగళవారం ఐకోర్టులో విచారణకు రానుంది. కాగా తనను అరెస్టు చేసినప్పుడు సిట్‌ ఆఫీస్‌ లో కొందరు ప్రైవేటు వ్యక్తులు విచారణ చేశారని,ప్రలోభ పెట్టారని రేవంత్‌ ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై ఎసిబి కౌంటర్‌ వేసిందని, విచారణ సమయంలో వాటిని పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది.కాగా రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ పై హైకోర్టులో మంగళవారం నాడు తీర్పు వెలువడవచ్చు.ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో పాటు ఉదయసింహా, సెబాస్టియన్‌కు రిమాండ్‌ ముగియడంతో వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా, ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ ముగ్గురికి వచ్చే నెల 13 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు కీలక దశలో ఉన్నందున ఈ ముగ్గురికి బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే కోర్టు వారికి రిమాండ్‌ పొడిగించింది. ఇక రేవంత్‌కు రిమాండ్‌ పొడిగించడంతో సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసుల గడువు కూడా  ముగియనుంది. సండ్రను కూడా ఏసీబీ అధికారులు ఏక్షణమైనా అరెస్టు అవకాశం ఉంది. సండ్ర అరెస్టుకు రెండు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బాబు వాయిస్‌టెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.