రైతుబంధుతో పెద్ద రైతులకే మేలు

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం పేరుతో ప్రజల సొమ్ము భూస్వాములకు దోచి పెట్టడం తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని టిడిపి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ పేర్కొన్నారు. పేదల డబ్బును పెద్దలకు బహిరంగంగా దోచి పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోందని అన్నారు. రైతుబంధు రాబందుల పాలైందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ దిల్లీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేవిూ లేదని, విద్యార్థులు, రైతుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రికి పట్టడం లేదని అన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులను దళారులు మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. నీళ్లు నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా.. ఆ ప్రయోజనాలు నేడు కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.