రైతుబీమాకు రైతులు సహకరించాలి

– ఇప్పటి వరకు 21లక్షల నామినీలు సేకరించాం
– జులై చివరినాటికి ఎల్‌ఐసీకి పత్రాలు సమర్పించాలి
– సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ ఎంపీ గుత్తా
నల్గొండ, జూన్‌29(జనం సాక్షి ) : రైతుబీమా విజయవంతానికి రైతులు సహకరించాలని రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌ కోరారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ జులై నాటికి ఎల్‌ఐసీకి పత్రాలు సమర్పించాలన్నారు. ఆగస్ట్‌ 15 తర్వాత బీమా చేసిన రైతు ఎవరైనా మరణించిన 10 రోజులలో ఆ కుటుంబానికి 5 లక్షలు అందజేస్తామని తెలిపారు. రైతులు ఎట్టి పరిస్థితులలో బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21లక్షల మంది రైతులు తమ నామినీ వివరాలు సేకరించటం జరిగిందని అన్నారు. మిగిలిన రైతులు స్వచ్చంధంగా ముందుకొచ్చి బీమాను నమోదు చేసుకోవాలని గుత్తా కోరారు. తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన, రైతు బంధు, రైతు బీమా ఇతర రాష్ఠాల్రకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, వారం, పది రోజులలో ఈ దిశగా చర్యలు చేపడితే రైతులకు లాభం కలుగుతుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో కేంద్రం కూడా రైతుల జపం చేస్తోందని పేర్కొన్నారు.  పలు రాష్టాల్లో రైతులు ఆందోళన బాట పట్టారని, తెలంగాణలో అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. పిడుగుపాటుకు మరణించిన రైతులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కేసీఆర్‌ అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని అన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు ఎంతో మేలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరల దగ్గర నుంచి రైతుల ఎదుర్కొనే సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.