రైతులకు అంకాపూర్‌ ఆదర్శం కావాలి

తుది దశకు భూరికార్డుల పరిశీలన: కలెక్టర్‌

కామారెడ్డి,నవంబర్‌8(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం రైతుల కోసం గ్రామ, మండల, జిల్లా సమన్వయ సమితిలను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లాలో 473 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందులో ఇప్పటి వరకు 265 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా 2 లక్షల 95 ఖాతాలను సరిచేశామని కలెక్టర్‌ అన్నారు. డిసెంబర్‌ 15 వరకు ఈ పక్రియ పూర్తి చేస్తామన్నారు.

జనవరిలో మిగిలిన భూముల రికార్డులు పరిశీలించి వందశాతం పూర్తి చేస్తామన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి రెండు పంటల కోసం నీరు వదులుతామన్నారు. ఇప్పటి వరకు 65 మంది ఏఈవోల పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. వ్యవసాయంలో ప్రతి గ్రామం మరో గంగాదేవిపల్లి, అంకాపూర్‌ కావాలన్నారు. జిల్లాలోని రైతుల ఖాతాల్లో ప్రతి ఎకరాకు రూ. 4 వేలకు సంబంధించిన డబ్బులు మొదటి విడత రూ. 250 కోట్లను త్వరనే జమ చేస్తామని అన్నారు. మరో పంట కోసం రెండో విడత రూ. 250 కోట్లు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, అనుకున్న సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, టీం లీడర్లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై పని చేస్తున్నారని అభినందించారు. ప్రజలు ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారులే తమ ముంగిటకు వచ్చి రికార్డులు సరి చేయడం, సమస్యలు పరిష్కరించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల భూములకు సంబంధించిన వివరాలను సంబంధిత ఫార్మాట్లలో నమోదు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలన్నారు. గ్రామంలో అందరికీ సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమాగ్ర భూ వివరాలను తెలియడం జరుగుతుందన్నారు. తద్వారా సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. సమస్యలుంటే సమన్వయంతో పరిష్కరించుకొని ముందుకు పోవాలని సూచించారు. ఎన్ని సర్వే నంబర్లు, పూర్తి అయ్యాయో, వాటిలో ఎన్ని సరి చేశారో, ఎన్ని సరి చేయలేదో వివరాలు ఎప్పటికప్పుడు పంపాలని తెలిపారు.