రైతులను సంఘటిత శక్తిగా తయారు చేస్తున్నాం

24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెరాసదే
ఆరునెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌
వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసిన మంత్రులు
సిరిసిల్ల, జూన్‌13(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సంఘటిత శక్తిగా తయారు చేసేలా కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్నజిల్లా సిరిసిల్ల అర్బన్‌ మండలం సర్దాపూర్‌లో వ్యవసాయ కళాశాలకు మంత్రి కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని, అలాగే రైతులను సంఘటిత శక్తిగా తయారు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే కేసీఆర్‌ కల అని మంత్రి తెలిపారు. నెహ్రూ ప్రధానిగా ఉండగా ఎస్పారెస్పీకి శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ రెండో దశ పనులు పూర్తి కాలేదన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కాలంతో పరుగులు పెడుతున్నాయని చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. రైతుజీవిత బీమా, రైతుబంధు పథకం రైతులకు ఒక ధీమాలాగా పని చేస్తున్నాయన్నారు. 58 లక్షల మంది రైతులకు రూ. 12 వేల కోట్లు రైతుబంధు పథకం కింద అందించామని తెలిపారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని వెల్లడించారు. అధికారులందరూ రైతులందరికీ రైతుబీమా పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుబీమా పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.