రైతుల్ని ఆదుకోవడంలో.. ప్రభుత్వం విఫలమైంది

– పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తాం
– నేడు జాతీయ రహదారులపై రైతుల వంటావార్పు చేపడతాం
– విలేకరుల సమావేశంలో టీజేఎస్‌ అధినేత కోదండరాం
హైదరాబాద్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం
విఫలమైందని టీజేఎస్‌ అధినేత కోదండరాం ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ఊదరగొట్టిన ఎంపీ కవిత, ఇంత వరకు పసుపు బోర్డ్‌ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రైతు ఆత్మగౌరవంతో బతికేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. విత్తనాలు, ఎరువుల విషయంలో వ్యాపారులు సిండికేట్‌ అయ్యారన్నారు. కేబినెట్‌ లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని కోదండరాం  వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తామని తెలిపారు. శనివారం జాతీయ రహదారుల విూద రైతుల వంటావార్పు ఉంటుందని వెల్లడించారు.  నిజామాబాద్‌ ఎర్రజొన్న, ఆర్మూర్‌ పసుపు పంట రైతులు సమస్యల్లో ఉన్నారని తెలిపారు. రైతులు పసుపు పంట అమ్ముకోవటానికి తెలంగాణలో మార్కెట్‌ కూడా లేదన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పసుపు బోర్డు వస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు చాలా దెబ్బ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రుల క్యాబినెట్‌ లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. వ్యవసాయ శాఖకు మంత్రి కూడా లేడన్నారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. పసుపుకు క్వింటాలుకు 15వేల రూపాయలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. తొలుత ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు కోదండరాం నివాళులర్పించారు.