రైతుల పాదయాత్రపై రాక్షసదాడి

మూడు రాజధానుల పేరుతో నాటకాలు:కళా

అమరావతి,డిసెంబర్‌7 (జనంసాక్షి) :    యజ్ఞంలా సాగుతున్న మహాపాదయాత్రను వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు వ్యాఖ్యలు చేశారు. నీటి ప్రాజెక్టుల గేట్లకు గ్రీజ్‌ పెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు.  టీడీపీ హయాంలో సన్‌ రైజ్‌ స్టేట్‌గా ఏపీ ఉంటే జగన్‌ వచ్చాక కరెప్షన్‌ రైజ్‌ స్టేట్‌గా మారిందన్నారు. వైసీపీ నేతలు అవినీతిలో మునిగి రాష్టాన్ని అప్పులతో ముంచుతున్నారని ఆరోపించారు. రైతులు సంకల్ప బలంతోనే 37 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల నుండి విశేషమైన స్పందన లభించడంతో వైసీపీకి గుబులుపుట్టిందని తెలిపారు. కనీసం అన్నం తినడానికి కూడా స్థలాలు కేటాయించకుండా వైసీపీ నేతలు పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలదాచుకోవడానికి నీడ లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా అమరావతిని కొనసాగించాలని కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు.