రైతే రాజు అన్న నానుడిని నిజం చేయాలి

– గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయం దండగన్నారు
– కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు
– రైతులకు అన్ని విధాల అండగా తెరాస ప్రభుత్వం
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌ నగర్‌, మే16(జ‌నం సాక్షి) : రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని అధిక దిగుబడులు సాధించి అభివృద్ధి చెందాలని.. రైతేరాజు అన్న నానుడిని నిజం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల మండలం పోలేపల్లిలో రైతుబంధు చెక్కుల పంపిణీ, పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు లేనిదే దేశానికి అన్నం లేదు. కానీ గత కొన్ని ఏళ్లుగా రైతాంగం నిర్లక్ష్యం చేయబడిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల వ్యవసాయం దండుగగా మారింది. తెలంగాణ ఆవిర్భావం, కేసీఆర్‌ సీఎం కావడంతో పరిస్థితి మారిందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలని సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. అందుకే రైతుబంధు పథకాన్ని అమలులోకి తెచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తుందన్నారు. రైతులు, వ్యవసాయాన్ని గత పాలకులు పట్టించుకోకపోగా.. తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కోతలు లేని విద్యుత్‌, వ్యవసాయానికి పగలే నాణ్యమైన కరెంట ఇస్తున్నా మని తెలిపారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లా రైతాంగం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తే పనిలేని ప్రతిపక్ష నాయకులు కోర్టుల్లో కేసు లు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
————————