రైనాను దాటేసిన రోహిత్‌..! 

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి) : భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ 55 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. దీంతో టీ20 క్రికెట్లో రోహిత్‌ సాధించిన సిక్స్‌ల సంఖ్య 268కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు 265 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్న రైనా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. ఆ తర్వాతి స్థానాల్లో యువరాజ్‌ సింగ్‌(244), ధోనీ(226), యూసుఫ్‌ పఠాన్‌(221), విరాట్‌ కోహ్లీ(217) ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ల జోడీ రోహిత్‌ శర్మ-ధావన్‌ తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించారు. భారత్‌ తరఫున టీ20ల్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. సిరీస్‌లో భాగంగా భారత్‌-కివీస్‌ మధ్య తదుపరి టీ20 ఈ నెల 4న జరగనుంది.